శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు
తిరుమల – వేసవి సెలవులు కావడంతో భక్తుల రద్దీ అంతకంతకూ ఎక్కువవుతోంది. తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. ఎక్కడ చూసినా శ్రీవారి నామ స్మరణే వినిపిస్తోంది. ఆపద మొక్కుల వాడిని కొలిచేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 78 వేల 177 మంది భక్తులు దర్శించుకున్నారు. 23 వేల 694 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.53 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం కలుగుతోంది.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు తెలియ చేయాలని ఈవో జె. శ్యామల రావు భక్తులకు విన్నవించారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేసినట్లు స్పష్టం చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి మే 01 తారీకు నుండి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది. సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది.