శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు
తిరుమల – తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీవారిని 87 వేల 254 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 777 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. స్వామి వారి దర్శనం కోసం భక్తుల క్యూ లైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ). ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమకు తెలియ చేయాలని ఈవో జె. శ్యామల రావు భక్తులకు విన్నవించారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ సేవలు ఏర్పాటు చేశారు.
కాగా భక్తులకు తీపి కబురు చెప్పారు ఈవో జె. శ్యామల రావు. రద్దీ కారణంగా రద్దు చేసిన సిఫారసు లేఖలను తిరిగి పునరుద్దరించినట్లు తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు సంబంధించిన లెటర్లను స్వీకరిస్తామన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దమని స్పష్టం చేశారు ఈవో.