Wednesday, April 23, 2025
HomeDEVOTIONALతిరుమ‌ల‌లో ఘ‌నంగా ఉగాది ఆస్థానం

తిరుమ‌ల‌లో ఘ‌నంగా ఉగాది ఆస్థానం

పాల్గొన్న చైర్మ‌న్ భూమ‌న‌..ఈవో ధ‌ర్మా రెడ్డి

తిరుమ‌ల – శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రం నూత‌న ఉగాది వేడుక‌లు టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా జ‌రిగాయి. శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమ‌న‌ కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయం లోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభి ముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు.

శ్రీవారి ఉత్సవర్ల పక్కనే మరో పీఠంపై స్వామి వారి సర్వ సైన్యాధ్యక్షులు శ్రీ విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూల విరాట్టుకు, ఉత్స‌వ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింప చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడుతూ, భక్తులందరికీ నూతన తెలుగు శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments