దుబాయ్ కి రావాలని విన్నపం
హైదరాబాద్ – దుబాయ్ లో మార్చి నెలలో జరిగే బహిరంగ సభకు రావాలని కోరారు గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు. వారితో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయాలని కోరారు.
గల్ఫ్ దేశాలలో మరణించిన వారికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్బంగా తెలంగాణ సర్కార్ జీవో జారీ చేయాలని కోరారు. అభయ హస్తంలో హామీ ఇచ్చారని వాటిని అమలు చేయాలని విన్నవించారు సీఎంకు.
ఈ సందర్బంగా సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఎన్నారైలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. గల్ఫ్ కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారం కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు.
మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. విదేశాలలో వున్న వలస కార్మికుల సమస్యలు తెలుసు కునేందుకు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.
సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), ఒమన్, బహ్రెయిన్, ఖతార్, కువైట్ వంటి ఆరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలలో దాదాపు 15 లక్షల మంది తెలంగాణ వలసదారులు నివసిస్తున్నారని తెలిపారు.
ఇదిలా ఉండగా టిపిసిసి ఎన్నారై విభాగానికి చెందిన ఆరుగురు సభ్యుల ప్రతినిధి బృందం 2024 జనవరి 26 నుండి 28 వరకు యూఏఈ దేశంలోని దుబాయి, అబుదాబిలను సందర్శించింది. ఈ ప్రతినిధి బృందానికి టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్, ఐఎఫ్ఎస్ (రిటైర్డ్) అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ నాయకత్వం వహించారు.
ప్రతినిధి బృందంలో సింగిరెడ్డి నరేష్ రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, జేజాల సైదయ్య బాబు, స్వదేశ్ పరికిపండ్ల, మంద భీంరెడ్డి ఉన్నారు.