తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి
తిరుమల – టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తులకు తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11న సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ సందర్బంగా కళ్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ సిద్దంగా ఉందని స్పష్టం చేసింది టీటీడీ.
ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో (జనరల్) శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు.
కడపజిల్లా ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభవంగా జరిగే రాష్ట్ర పండుగ శ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి సేవా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.