ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి – టిటిడి స్థానిక ఆలయాల్లో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండ రామాలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగనున్నాయి. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం వైభవంగా జరుగనుంది. అనంతరం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు పుష్పపల్లకీలో అమ్మవా రు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. రాత్రి 8 నుంచి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు ఉగాది ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేయనున్నారు.
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు ఆలయంలో ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉదయం 9 నుండి 10 గంటల వరకు పంచాంగ శ్రవణం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.