తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నాయుడు
తిరుమల – తిరుమలలో పచ్చదనం పెంపొందిస్తామని , సామాన్య భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆదాయం అనేది టీటీడీ ప్రాధాన్యత కాదన్నారు. భక్తులకు నాణ్యమైన, సరసమైన ఆహారం విక్రయించే బ్రాండెడ్ సంస్థలకు టెండర్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. గోశాలలో గోవులను మరింత ఆరోగ్యంగా సంరక్షించడంపై చర్యలు చేపట్టామన్నారు. సీఎం ఆదేశాల మేరకు అటవీ శాఖకు రూ. 4 కోట్లు మంజూరు చేశామన్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, అమరావతి వేంకటేశ్వరస్వామి ఆలయం, నారాయణవనం కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, కపిలతీర్థం కపిలేశ్వరస్వామి ఆలయం, నాగాలాపురం వేదనారాయణస్వామి ఆలయం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాల అభివృద్ధి కోసం సమగ్ర బృహత్ ప్రణాళిక తయారు చేసేందుకు ఆర్కిటెక్ట్ ల నుండి సాంకేతిక, ఆర్థిక ప్రతిపాదనలు స్వీకరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు బీఆర్ నాయుడు.
తిరుమలలోని విశ్రాంత భవనాల పేర్లు మార్పులో మిగిలిన ఇద్దరు దాతలు స్పందించ లేదన్నారు. దీంతో ఈ విశ్రాంతి గృహాల పేర్లను టీటీడీనే మార్పు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన సైనిక్ నివాస్ పేరు విషయంలో వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు .
తిరుమలలోని బిగ్ క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్సు ఫీజును నిర్ణయించే అంశంపై ఆమోదం తెలిపామని, భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు పేరొందిన సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు టీటీడీ చైర్మన్.
ఆకాశగంగ, పాపవినాశనం ప్రాంతాలను భక్తులు విశేష సంఖ్యలో సందర్శిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఆధ్యాత్మిక, పర్యావరణ, మౌలిక సదుపాయాలను మరింత పెంచేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాయలసీమకే తలమానికంగా ఉంటూ ఎందరో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న స్విమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆర్థిక సహాయంగా ఏడాదికి ఇప్పుడు అందిస్తున్న రూ.60 కోట్లతో పాటు అదనంగా మరో రూ.71 కోట్లు అందించేందుకు ఆమోదం తెలిపామన్నారు.
స్విమ్స్ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నియామకం చేపట్టేందుకు నిర్ణయం. అదేవిధంగా 85 శాతం నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవంతులను (ఆంకాలజీ , పద్మావతి చిన్ని పిల్లల ఆసుపత్రిలతో కలిపి) త్వరలోనే మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేలా చేస్తామన్నారు.
ఒంటిమిట్టలో భక్తులకు అన్నదానం సేవలను మరింత పెంచాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు బీఆర్ నాయుడు. తుళ్లూరు మండలం అనంతవరంలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు రూ.10 కోట్లు కేటాయించేందుకు ఆమోదించామన్నారు.