అభినందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల – తిరుమల పుణ్యక్షేత్రం కిట కిట లాడుతోంది భక్త బాంధవులతో. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు కొండపై. వేలాది మంది ప్రతి రోజూ స్వామి , అమ్మ వార్లను దర్శించుకుంటున్నారు. ఈ సంరద్బంగా టీటీడీ విస్తృతంగా సేవలు అందిస్తోంది. ఇదిలా ఉండగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు చెప్పారు. ఎక్కడా రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఇంకా ఎన్ని లక్షల మంది వచ్చినా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు.
ఈ సందర్బంగా శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. వారిని ఈ సందర్బంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. తిరుమలలో ప్రతిరోజూ దాదాపు మూడు వేల మంది శ్రీవారి సేవకులు భక్తులకు విస్తృత సేవలు అందిస్తున్నారని చెప్పారు బీఆర్ నాయుడు. . క్యూలైన్లలోని భక్తులకు నిరంతరాయంగా నాలుగు షిప్టులలో అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. వీరి సేవలను శ్రీవారి సేవ గ్రూప్ సూపర్ వైజర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.
విజిలెన్స్, ఆలయ విభాగాలు దర్శన క్యూలైన్లను సమర్థంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు టీటీడీ చైర్మన్. గత మూడు రోజుల్లో దాదాపు 2.4 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో పేర్కొన్నారు. కల్యాణకట్ట, మెడికల్, రేడియో, రిసెప్షన్ ,బ్రాడ్ కాస్టింగ్ తదితర విభాగాలు కూడా భక్తులకు అవసరమైన సేవలను నిరంతరాయంగా అందిస్తున్నట్లు చెప్పారు.