తిరుపతి యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో
తిరుపతి – బ్రహ్మర్షి డా. చాగంటి కోటేశ్వర రావుకు అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది టీటీడీ.హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిర్వాహకులపై కేసు నమోదైంది. ఎలాంటి అవమానం జరగలేదని వివరణ ఇచ్చినా కావాలని దుష్ప్రచారం చేశారని ఈవో శ్యామల రావు తెలిపారు. న్యూఢిల్లీ, విజయవాడలో ఉన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఫిర్యాదు చేశామన్నారు.
కాగా చాగంటి కోటేశ్వర రావు తిరుమల పర్యటనపై వాస్తవ సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా టిటిడి వెల్లడించినా కావాలని వ్యతిరేక ప్రచారం చేశారని వాపోయారు. పదే పదే టిటిడి ప్రతిష్టను దెబ్బతినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారని పేర్కొన్నారు.
భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాగంటి కోటేశ్వర రావు ఆద్యాత్మిక అభిమానుల మనోస్థైర్యాన్ని పలుచన చేసేలా విష ప్రచారం చేసిన సదరు సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ లను రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ కి కూడా ఫిర్యాదు చేశామన్నారు.