స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్, ఈవో
తిరుమల – టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీ. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించింది. గత సంవత్సర కాలంలో టీటీడీ తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలకు అన్ని మఠాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయని తెలిపింది. టీటీడీ కూడా పలు మఠాలకు నిబంధనల ప్రకారం మరమ్మతులు, ఆధునీకరణ చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని పేర్కొంది. భక్తులకు పెద్ద ఎత్తున వసతి సౌకర్యాలను కల్పించడం జరుగుతోందని స్పష్టం చేసింది.
ఏఐ టెక్నాలజీతో దర్శనం చేయిస్తామని చెప్పి భక్తులను అడ్డుకుంటున్నారని అవాస్తవాలు పలికే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికింది టీటీడీ. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితులను ఎప్పటికప్పుడు విశ్లేషించి భక్తుల సౌకర్యార్థం శాస్త్రీయ పద్ధతిలో సమయ పాలన పాటిస్తూ, క్యూలైన్లను పకడ్బందీగా నిర్వహిస్తూ వస్తున్నామని పేర్కొంది.
బయట క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 22 ఫుడ్ కౌంటర్లను అదనంగా ఏర్పాటు చేసి శ్రీవారి సేవకుల ద్వారా వారికి అన్న ప్రసాదాలు, పాలు, టీ, కాఫీ, మజ్జిగ, స్నాక్స్ ను విధిగా టైమ్ లైన్ ప్రకారం అందిస్తూ వస్తున్నామని తెలిపింది. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా అత్యధిక స్థాయిలో గురు, శుక్ర, శని, ఆది వారాల్లో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలను అందిస్తున్నామని స్పష్టం చేసింది.
టీటీడీ అందిస్తున్న వివిధ సౌకర్యాలపై మూడు విధాలుగా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయ సేకరణ చేస్తున్నామని తెలిపింది టీటీడీ. IVRS, WHATSAPP, శ్రీవారి సేవకులు ద్వారా సేకరిస్తున్న అభిప్రాయాల్లో 90 శాతానికి పైగా భక్తులు టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాద, వసతి, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు, తదితర సేవలపై సంతృప్తిని వ్యక్తం చేశారని వెల్లడించింది. ఇక ఏఐ ప్రాజెక్టు సాకారం కావడానికి టీటీడీ అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపింది.