వెల్లడించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్తుల అభిప్రాయాల కోసం టీటీడీ కొత్త వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు. మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ఓ కొత్త ఫీడ్బ్యాక్ విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. ఇకపై భక్తులు తమ అభిప్రాయాన్ని వాట్సాప్ ద్వారా సులభంగా తెలియ జేయవచ్చన్నారు. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుందన్నారు. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం (అన్నప్రసాదం, శుభ్రత, కల్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి)ను ఎంచుకోవాల్సి ఉంటుందన్నారు.
శుక్రవారం ఈవో శ్యామల రావు మీడియాతో మాట్లాడారు. అనంతరం, అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ ను ఎంచుకోవచ్చని తెలిపారు. సేవా ప్రమాణాన్ని ఉత్తమం, సగటు/మరింత మెరుగుదల అవసరం, లేదా బాగా లేదు గా రేట్ చేయాల్సి ఉంటుందన్నారు. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. అభిప్రాయం సమర్పించిన వెంటనే, మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడింది. మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుందన్నారు.
భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు ఈవో జె. శ్యామల రావు.