23న వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల
తిరుమల – వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏర్పాట్లపై అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.. 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల.
24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల.
జనవరి 10 నుండి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్ డి టోకెన్లు కేటాయింపు.
తిరుపతిలో ఎం.ఆర్.పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.
టోకెన్ జారీ కేంద్రాలు వద్ద భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సీఈని ఆదేశించారు ఈవో. టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు . టోకెన్ లేని భక్తులు తిరుమలకు రావచ్చు. కానీ దర్శన క్యూ లైన్లలోకి అనుమతించడం జరగదన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4.45 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం. అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు. ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం. ఉదయం 5.30 నుండి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం ఉంటుందన్నారు ఈవో.
గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది సమన్వయంతో తిరుమలలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.
ఉదయం 6 నుండి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులను ఆదేశించారు జె. శ్యామల రావు. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ చేయాలన్నారు.
లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో3.50 లక్షల లడ్డూలు. అదనంగా 3.50 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీధర్ అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు.