స్పష్టం చేసిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుపతి – శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగుల సమస్యలను నిర్దేశించన సమయంలో పరిష్కరించాలని టిటిడి ఈవో జె. శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడిలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించార. టిటిడి పరిధిలోని ఉద్యోగుల సమస్యలను నిర్దేశించిన సమయంలోను, ప్రభుత్వ పరిధిలోని అంశాలపై వారితో చర్చించి అనుమతులు తీసుకుని పరిష్కరించాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ఫండ్ కేటాయింపులోను, ఇతర అలవెన్స్ ల చెల్లింపులోను అలసత్వం లేకుండా పరిష్కరించాలని కోరారు.
నిబంధనల ప్రకారం పదోన్నతులు, బదిలీలు, కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. జీఎన్బీ, ఎస్వీ పూర్ హోమ్, కే.టీ, వినాయకనగర్, రామనగర్ ప్రాంతాలలోని టిటిడి క్వార్టర్స్ లలో డ్రైనేజీ సమస్యలు, భవనాల లీకేజీలు, విద్యుత్ తదితర సమస్యలను తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేటాయించిన ఇళ్ల స్థలాలపై వివిధ శాఖల అనుమతులు విషయంలో సీనియర్ అధికారులతో కమిటీ వేసుకుని పరిష్కరించాలని సూచించారు.
సదరు ప్రాంతాలలో రోడ్లు, కాలువలు, ఇతర ఇంజనీరింగ్, మౌళిక సదుపాయాలపై టిటిడి ఉన్నతాధికారులు చర్చించాలన్నారు. దిగువ స్థాయిలో ఉద్యోగుల సమస్యలపై నిరంతరం సీనియర్ అధికారులు చర్చించి పరిష్కరించాలని, ప్రభుత్వ స్థాయిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని టిటిడి అధికారులను ఈవో కోరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సిఈ టివి సత్యనారాయణ, డిఎల్వో వరప్రసాద్ రావు, పలు శాఖల డిప్యూటీ ఈవోలు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.