వెల్లడించిన టీటీడీ ఈవో జె. శ్యామల రావు
శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు వచ్చే జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. గత టిటిడి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు.
ఇదిలా ఉండగా తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా గతంలో వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ హయాంలో ఈ అవకాశాన్ని తొలగించింది. తాజాగా పాలకమండలి మారడం, చిత్తూరు జిల్లాకు చెందిన టీవీ5 చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు చైర్మన్ కావడంతో తిరిగి స్థానిక భక్తులకు మహత్ భాగ్యాన్ని కల్పించారు.