హోం మంత్రి వంగలపూడి అనిత
అమరావతి – రాష్ట్రంలో ఏ విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు మంత్రి వంగలపూడి అనిత. ఏపీ రక్షణ కోసం బీజం వేసిన సీఎం చంద్రబాబు ఆకాంక్ష రేపటితో నెర వేరనుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండ పావులూరులో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను ఆదివారం ప్రారంభించనున్నారని తెలిపారు.
శనివారం వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట భద్రత చర్యలు చేపట్టిందన్నారు. అన్ని శాఖల సమన్వయంతో బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లను సైతం పూర్తి చేయడం జరిగిందని చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్ , ఎన్ఐడీఎంలు ఏర్పాటవుతున్న చోట రహదారులు సరిగా లేక పోవడంతో గతంలో భూములు సేకరించారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణం దిశగా ఎలాంటి చొరవ చూపలేదని ఆరోపించారు. పదే పదే కేంద్రం వైసీపీ ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించు కోలేదన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రహదారులను అభివృద్ధి చేసిందని తెలిపారు వంగలపూడి అనిత.