మే 17 నుండి 19వ తేదీ వరకు ఉత్సవాల నిర్వహణ
తిరుపతి – శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక వసంతోత్సవాలు మే 17 నుండి 19వ తేదీ వరకు జరుగనున్నాయి. మే 18న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు స్వర్ణ రథంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.ఉత్సవర్లను ఆలయంలోని వసంత మండపానికి వేంచేపు చేసి ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్ సేవ, వీధి ఉత్సవం నిర్వహిస్తారు.
తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయ నాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి, శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామి సమేత శ్రీరామచంద్ర మూర్తి, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవ మూర్తులను వేంచేపుగా తీసుకొచ్చి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు.
వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవం అంతరార్థం అని అర్చకులు తెలిపారు.ఈ సందర్భంగా మే 17 నుండి 19వ తేదీ వరకు ఆలయంలో కల్యాణోత్సవం ఆర్ధిత సేవను టిటిడి రద్దు చేసింది.