ఏడుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ టీం
వరంగల్ జిల్లా – టాస్క్ ఫోర్స్ పోలీసులు జూలు విదిల్చారు. ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గడువు తీరిన పురుగు మందులు తక్కువ ధరకు అంటగడుతూ మోసానికి పాల్పడుతున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుండి రూ. 78 లక్షల 63 వేల రూపాయల విలువ కలిగిన, గడువు తీరిన నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, మిషనరీ, ప్రింటింగ్ సామాగ్రి, రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అరెస్ట్ చేసిన వారిలోఇరుకుల్ల వేదప్రకాశ్, మహ్మద్ సిద్దిక్ ఆలీ, నూక రాజేష్ ఆలియాస్ రాజు, యల్లం సదాశివుడు , యం.డి రఫీక్, ఆళ్లచేరువు శేఖర్ (ప్రకరాశం జిల్లా) , పొదిళ్ళ సాంబయ్య ను అరెస్ట్ చేశామన్నారు. కాగా విష్ణు వర్దన్ పరారీలో ఉన్నాడని, మరొకరు ముద్దగల ఆదిత్య ప్రస్తుతం హైదరాబాద్ జైలులో ఉన్నారని వెల్లడించారు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ , మట్టెవాడ పోలీసులు, వ్యవసాధికారులు సంయుక్తంగా కలిసి మట్టెవాడ బోడ్రాయి ప్రాంతంలోని ప్రధాన నిందితుడు ఇరుకుళ్ళ వేదప్రకాశ్ ఇంటిపై దాడి చేయడం జరిగిందన్నారు. దీంతో మొత్తం బండారం బయట పడిందన్నారు.