పాల్గొన్న కవులు..రచయితలు..కళాకారులు
విజయవాడ – మాతృ భాషను భవిష్యత్తు తరాలకు పదిలంగా అందించడమే లక్ష్యంగా ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు.
అంతకు ముందు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు.
ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, మండలి బుద్ధ ప్రసాద్, విశ్వ హిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం. నాగేశ్వరరావు, తెలంగాణ శాసనమండలి సభ్యుడు, కవి గోరటి వెంకన్న, సినీ గేయ కవి భువనచంద్ర, ఆచార్య కొలకలూరి ఇనాక్ తదితరులు మహాసభల్లో పాల్గొన్నారు.
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫొటో ప్రదర్శనను అతిథులు తిలకించారు. నగరంలోని కె.బి.ఎన్.కళాశాల ప్రాంగణంలో రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు.
పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో రెండు వేదికలనూ.. సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. ఇతర రాష్ట్రాలు, మహిళా ప్రతినిధులకు ప్రత్యేకంగా సదస్సులు, తెలుగు భాషా పరిశోధనపై, సాహితీ, విద్యారంగ ప్రముఖులు, భాషోద్యమం, శాస్త్ర సాంకేతిక రంగం.. ఇలా అన్నింటిలోనూ మాతృ భాషకు ప్రాధాన్యం ఇవ్వాలనే కోణంలో కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించారు.