నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి
అమరావతి – అబద్దాలు అందంగా చెప్పడంలో చంద్రబాబు నాయుడు దేశంలోనే నెంబర్ వన్ అన్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనంటూ కొట్టి పారేశారు. అధికారం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చిన కూటమి సర్కార్ ఇప్పుడు వాటిని నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, దీని నుంచి దృష్టి మరల్చేందుకు తమను టార్గెట్ చేశారంటూ ధ్వజమెత్తారు మాజీ ముఖ్యమంత్రి.
తప్పుదారి పట్టించే ప్రకటనలను తీవ్రంగా ఖండించారు. తప్పుడు సమాచారంతో నిండిన ఆయన ప్రజెంటేషన్ ఉద్దేశ పూర్వకంగా , బురద చల్లే విధంగా ఉందన్నారు. వైఎస్ఆర్సిపి పాలనా కాలంలో మూలధన వ్యయం తగ్గిందని నాయుడు చేసిన వాదన నిరాధారమైనదని అన్నారు జగన్ రెడ్డి..
కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (CAG) రికార్డుల ప్రకారం తమ ఐదేళ్ల పదవీకాలంలో (2019-24) సగటు మూలధన వ్యయం రూ. 15,632.86 కోట్లుగా ఉందని తెలిపారు. ఇది టిడిపి పాలనలో (2014-19) నమోదైన రూ. 13,860.60 కోట్లను అధిగమించిందని గుర్తు చేశారు. 2018-19 (TDP)ని 2022-23 (YSRCP)తో పోల్చడం ద్వారా, బాహ్య ఆర్థిక పరిస్థితులు సహా బహుళ అంశాల ఆధారంగా మూలధన వ్యయం ఏటా హెచ్చుతగ్గులకు లోనవుతుందనే వాస్తవాన్ని నాయుడు సౌకర్యవంతంగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.