మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – మాజీ సీఎం జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సర్కార్ పై భగ్గుమన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు బోర్డు సందర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీశారు. గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టించు కోవడం లేదన్నారు. ఈ సీజన్ లోనే ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పరుచూరులో ఒక రైతు, గడిచిన శుక్రవారం కొండేపిలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అయినా సర్కార్ కు సోయి లేకుండా పోయిందన్నారు.
రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, కనీస మద్దతు ధర కంటే రూ.300 తక్కువ రైతులకు చెల్లించారని ఆరోపించారు జగన్ రెడ్డి. వరి, మిరప, పత్తి, జొన్న, కందులు, పెసలు, రాగులు, మొక్కజొన్న, కోకో, వేరుశనగ, చీనీ, పొగాకు ఇలా.. ఏ పంట తీసుకున్నా రైతన్నకు రాష్ట్రంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు మాజీ సీఎం.
రైతు భరోసా కింద ఇచ్చిన పెట్టుబడి సాయం చంద్రబాబు వచ్చిన తర్వాత ఆగి పోయిందన్నారు. తమ హయాంలో ప్రతి పంటకు రైతులకు ఉచితంగా బీమా సదుపాయం కల్పించామని చెప్పారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక వాటిని పక్కన పెట్టిందని ఆరోపించారు. ఈ క్రాప్ వ్యవస్థను పూర్తిగా , కావాలని నీరు గార్చారంటూ ధ్వజమెత్తారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారని ఫైర్ అయ్యారు జగన్ మోహన్ రెడ్డి.