ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన షర్మిల
అమరావతికి చెంబెడు నీళ్లు, గుప్పెడు మట్టి మాత్రమే ప్రధానమంత్రి మోదీ సాయం చేశారని ఎద్దేవా చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. ఆనాడు గాలి మోటార్లో తిరిగి ఆంధ్రుల నెత్తి మీద మట్టి కొట్టారంటూ వాపోయారు. ఇప్పుడు మళ్ళీ సున్నం కొట్టడానికి వస్తున్నారంటూ మండిపడ్డారు. చివరికి ఆత్మ గౌరవం అమరావతిని మోడీ శంకుస్థాపనల ప్రాజెక్ట్ కింద మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని నిర్మాణంపై బీజేపీ చేస్తున్నది ఘరానా మోసం, రాష్ట్రానికి చేసింది ద్రోహం అంటూ మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించి తీరని అన్యాయం చేశారన్నారు.
గురువారం వైఎస్ షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.15 వేల కోట్లు అప్పు ఇచ్చి రాజధానిని ఉద్ధరించినట్లు గొప్పలు చెప్పడం సిగ్గు చేటు అన్నారు. నిజంగా అమరావతిపై మోడీకి చిత్తశుద్ధి ఉంటే 9 ఏళ్లు గాడిదలు కాశారా అంటూ ఫైర్ అయ్యారు. రాజధాని పనులపై ఒక్కనాడైనా బాధ్యతగా అడిగారా ?
ఒక్క రూపాయి నిధులైనా అమరావతికి కేటాయించారా ? 3d గ్రాఫిక్స్ అమలు సంగతేంటని చంద్రబాబును ప్రశ్నించారా అని నిలదీశారు. గత YCP ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతుంటే వేడుక చూసింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది తప్పని మీ దత్తపుత్రుడిని ఎందుకు వారించలేదు ? అమరావతి రైతుల ఉద్యమం ఢీల్లీ దాకా పాకితే కనీసం స్పందించలేదు ఎందుకు ? ఢీల్లీనీ మించిన రాజధాని కట్టిస్తామని ఇచ్చిన హామీ మరిచి పోయారా ? ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేసి ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని, రాజధాని శంకుస్థాపనకు వస్తున్నారో మోడీ మాధానం చెప్పాలన్నారు. 10 ఏళ్లు దాటినా రాష్ట్రానికి రాజధాని లేదంటే.. ఇందుకు ప్రధాన ముద్దాయి A1 మోడీ అంటూ ఆరోపించారు. A2 చంద్రబాబు, A3 జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు