స్పష్టం చేసిన ఏపీ మంత్రివర్గం
అమరావతి : ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఏపీ కేబినెట్ లోని మంత్రివర్గ ఉప సంఘం. ఈ మేరకు శనివారం అమరావతిలోని సచివాలయంలో ఉద్యగ సంఘాల ప్రతినిధులతో మంత్రులు భేటీ అయ్యారు. విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలపై ఎపి సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం (జిఓఎం) ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ డిఏలు సహా ఇతర అంశాలపై మంత్రుల బృందం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించింది.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్, కార్యదర్శి వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులు పాల్గొన్నారు.
అదే విధంగా గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు , ఏపీ జేఏసీ, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జిజిఓ ఎ.విద్యాసాగర్, యుటిఎఫ్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కె.సూర్యనారాయణ, తదితర సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.






