ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం
తిరుమల : టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే వేసవిలో తెలుగు రాష్ట్రాలలో 8,9,10 తరగతి విద్యార్థులకు ”సద్గమయ” అనే కార్యక్రమం ద్వారా నైతిక విలువలు, మానవీయ ధర్మాలు, వ్యక్తిత్వ నిర్మాణానికై శిక్షణ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్ణయించారు. తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు రిజిస్టర్ అయిన 7856 భజన బృందాలు నైపుణ్యాన్ని పరిశీలించి జిల్లా స్థాయిలో భజన ప్రదర్శనలను ఏర్పాటు చేసి వాటిని క్రమ బద్ధీకరించేందుకు తీర్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు జానకిదేవి, మహేందర్ రెడ్డి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ కూడా జరిగింది. ఈ సమావేశంలో 236 స్టాఫ్ నర్సులు, 20 పారా మెడికల్ సిబ్బంది, 48 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సదాశివరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి.కుమార్, తదితరులు పాల్గొన్నారు.






