నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్ : సాయి ఈశ్వరాచారి బీసీల రిజర్వేషన్ల కోసం బలిదానం చేసుకున్నా కనీసం కాంగ్రెస్ సర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేదని, సంతాపం కూడా తెలియ చేయక పోవడం దారుణమన్నారు బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పార్టీలకు వారు ఏమై పోయినా పట్టించుకోవడం లేదన్నారు. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే సాయి ఈశ్వర చారి మరణం పట్ల సీఎం స్పందించే వారన్నారు. తెలంగాణలో ఉండి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీసం ఫోన్ లో కూడా పరామర్శించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకునే బాధ్యత బిసి మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో సాయి ఈశ్వర చారి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే డిల్లీలో రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
బీసీల రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి అంతిమయాత్ర సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని వందలాది మంది బీసీ సంఘాల శ్రేణులు హైదరాబాదులోని జగద్గిరిగుట్టలో పాల్గొన్నారు . అంతిమయాత్ర సందర్భంగా దారి పొడవునా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈశ్వర చారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బీసీలకు జరిగిన అన్యాయంపై, బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు మాట మార్చి మోసం చేసినందుకే సాయి ఈశ్వర చారి అన్యాయాన్ని తట్టుకోలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని మరణించాడని వాపోయారు. ఒక తెలంగాణ బిసిబిడ్డగా ఈశ్వర చారి మరణిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించక పోవడం వారి బీసీ వ్యతిరేక నైజానికి నిదర్శనమన్నారు .






