ముస్తాబైన హైదరాబాద్ చెరువులు
హైదరాబాద్ : ఆక్రమణకు గురైన చెరువులు ఇప్పుడు కొత్త రూపు సంతరించుకున్నాయి హైడ్రా కారణంగా.
ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్కు వేదికలైన చెరువులు ఆక్రమణలు వదిలించుకుని.. విస్తరణకు నోచుకున్నాయి. ఆక్రమణలకు గురై 14 ఎకరాలకు కుంచించుకు పోయిన మాధాపూర్లోని తమ్మిడికుంట చెరువును 30 ఎకరాలకు హైడ్రా విస్తరించింది. అలాగే కూకట్పల్లిలోని నల్ల చెరువు విస్తీర్ణాన్ని కూడా 16 ఎకరాల నుంచి 30 ఎకరాలకు పెంచింది. పాతబస్తీలోని బమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు తాగు నీటి అవసరాలను తర్చేలా 104 ఎకరాల మేర ఈ చెరువు విస్తరించి ఉందని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో చెరువు విస్తీర్ణం తగ్గుతూ హెచ్ ఎం డీ ఏ ఈ చెరువును 17.05 ఎకరాలుగా నిర్ధారించింది.
చివరికి 4.12 ఎకరాలుగా మిగిలి పోయింది. ఇప్పుడీ చెరువును 17 ఎకరాలకు విస్తరించి నయన మనోహరంగా తీర్చిదిద్దింది. ఇటీవల గ్లోబల్ సమ్మిట్కు హాజరైన పర్యావరణవేత్తలు హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హైడ్రా లాంటి వ్యవస్థ దేశ వ్యాప్తంగా ఉండాలని అభినందించారు. హైడ్రా మొదట విడత చేపట్టిన 6 చెరువుల్లో బతుకమ్మకుంట ఇప్పటికే ప్రారంభం కాగా.. తమ్మిడికుంట, బమ్-రుక్న్-ఉద్-దౌలా, నల్లచెరువులు ప్రారంభానికి సిద్ధమై.. కైట్ ఫెస్టివల్కు వేదికలయ్యాయి. మాధాపూర్లోని సున్నం చెరువు, ఉప్పల్లోని నల్లచెరువు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి.






