స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్న వరుస అగ్ని ప్రమాద ఘటనలపై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నాంపల్లిలో జరిగిన ఫర్నీచర్ దుకాణం సెల్లార్లలో లెక్కకు మించిన ఫర్నీచర్ను పెట్టడం జరిగిందన్నారు. సెల్లార్లోనే వాచ్మ్యాన్కు నివాసం కల్పించడం పట్ల మండిపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు షాపులో ఉన్న వారు బయటపడినా.. సెల్లార్లో ఉన్న వారు మంటల్లో చిక్కుకున్నారని అన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యారు కమిషనర్. ఇందులో కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని అన్నారు.
వస్త్ర దుకాణదారులు, ఫర్నీచర్ షాపులతో పాటు ఇతర వ్యాపారాలు చేసిన వారు.. వారి నిలువలను మెట్ల మార్గంలో, కారిడార్లో, సెల్లార్లలో నిలువ ఉంచరాదని స్పష్టం చేశారు కమిషనర్. ఇందుకు ప్రత్యేకంగా జన సంచారం లేని ప్రాంతాల్లో గోదాముల్లో నిలువ ఉంచుకోవాలని అన్నారు. సెల్లార్ లు వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాలి. పేలుడు, మండే స్వభావం ఉన్న వస్తువులు, పదార్థాలు నిల్వ ఉంచరాదని పేర్కొన్నారు. వ్యాపార సముదాయాల్లో నివాసాలు ఏర్పాటు చేయరాదని సూచించారు. అలాగే సెల్లార్లలో వర్కర్లు, వాచ్ మ్యాన్ కుటుంబాలకు గదులు కేటాయించడం చేయ రాదన్నారు. సెల్లార్ నుంచి టెర్రాస్ వరకూ మెట్ల మార్గాలను ఎట్టి పరిస్థితులలో బ్లాక్, లాక్ చేయొద్దన్నారు. షాపులు, వ్యాపార సముదాయాల్లో ఉన్న అగ్ని నియంత్రణ పరికరాలు ఎల్లవేళలా పని చేసే విధంగా ఉంచుతూ, సిబ్బందికి అగ్ని పరికరాలపై తగిన అవగాహన కల్పించాలని సూచించారు ఏవీ రంగనాథ్.






