ఆధునిక కుట్టు మిషన్లు అందజేస్తామన్న మంత్రి
తాడేపల్లి గూడెం : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం పాటు పడుతోందని చెప్పారు. రాష్ట్రంలో అత్యధికంగా టైలర్ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని, వారందరికీ మేలు చేకూర్చేలా సమర్థవంతమైన నాయకుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ఆప్కోను మరింత బలోపేతం చేసేందుకు ఫోకస్ పెట్టామన్నారు. దేశ వ్యాప్తంగా విస్తరించేలా ఆలోచిస్తున్నట్లు తెలిపారు. వృత్తి పనుల్లో ఉన్న వారికి మరింత మేలు చేకూర్చేలా కృషి చేస్తున్నామన్నారు.
టైలర్లకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టంచేశారు. టైలర్ల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.19 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల్లోనూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సవిత దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






