ఆనాటి ఎంజీఆర్ తో పోల్చుకున్న చీఫ్
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొలువు తీరిన ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే సర్కార్ ను ఏకి పారేశారు టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్. తను పార్టీ స్థాపించి 2 ఏళ్లు అయిన సందర్బంగా జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ఆనాటి , దివంగత సీఎం ఎంజీఆర్కు ఉన్నంత అనుభవం తనకు లేదన్నారు. తనకు రాజకీయ పరిజ్ఞానం లేని కేవలం ఒక నటుడిని మాత్రమే అని చెప్పి ఇప్పుడు తనను లక్ష్యంగా చేసుకుంటున్నది కూడా అవే ‘శక్తులు’ అని ఆయన అన్నారు. 1977లో ఒక రేడియో ఇంటర్వ్యూలో ఎంజీఆర్, అన్నాదురై కూర్చున్న స్థానాన్ని వారు ఆక్రమించడంపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని చెప్పినట్లే, ఇప్పుడు కే కామరాజ్, సి ఎన్ అన్నాదురై, ఎంజీఆర్ వంటి గొప్ప నాయకులు ఒకప్పుడు కూర్చున్న స్థానాన్ని ఆ ‘శక్తులు’ ఆక్రమించడంపై ప్రజలు విచారిస్తున్నారని పేర్కొన్నారు విజయ్.
2021 తర్వాత డీఎంకే అధికారంలోకి రావడంపై అసంతృప్తితో ఉన్న ప్రజల కన్నీళ్లను తుడవడానికే టీవీకే పార్టీని ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. డీఎంకే 1977లో ఎంజీఆర్ను కించ పరచడానికి ఉపయోగించిన అవే ఆయుధాలను ఇప్పుడు కూడా వాడుతోందని, దాంతో వారికి ‘అయ్యా, కాలం మారింది, సాంకేతికత అభివృద్ధి చెందింది, దయచేసి మీ వ్యూహాన్ని మార్చుకోండి అని చెప్పాలని అనిపిస్తోందని అన్నారు. విజయ్ను తన ఇంటి నుండి బయటకు రావాలని కొందరు ఇచ్చిన పిలుపుపై స్పందించారు. పోలింగ్ బూత్ల ముందు వరుసలో నిలబడతారని, అప్పుడు ఆ పిలుపునిచ్చిన వారు తమ చర్యకు పశ్చాత్తాప పడతారని, ఇది ఖాయమని ధీమా వ్యక్తం చేశారు టీవీకే విజయ్.






