newsseals.com
News

రూ. 233 కోట్ల శ్రీ‌వారి నిధుల‌ను దోచుకున్నారు

VijayaBhaskar February 3, 2026
newsseals-PawanKalyan
Spread the love

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్

మంగ‌ళ‌గిరి : గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో వైసీపీ నేత‌లు పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. క‌ల్తీ నెయ్యిని ఉప‌యోగించి 63 ల‌క్ష‌ల ల‌డ్డూలు విక్ర‌యించార‌ని పేర్కొన్నారు. ఏకంగా శ్రీ‌వారి నిధుల నుంచి రూ. 233 కోట్లు దోచుకున్నార‌ని ఆరోపించారు. జంతు కొవ్వు నుంచి వచ్చిన రసాయనాలతో నెయ్యి సృష్టించార‌ని పేర్కొన్నారు. ఆ సింథటిక్ నెయ్యి తిరుమలకు సరఫరా చేశార‌ని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా చేసిన డెయిరీలకు ఆవులు లేవు. కనీసం పాలుగానీ, వెన్నగానీ కూడా ఎక్కడా సేకరించిన దాఖలాలు లేవ‌న్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయినా నెయ్యిని ఎలా స‌ర‌ఫ‌రా చేశారంటూ ప్ర‌శ్నించారు.

60 లక్షల కిలోలు. నువ్వుల నూనె కంటే కారు చౌకగా నెయ్యి సరఫరా చేశారని ఆరోపించారు. ప్రతి చుక్కా కల్తీయే. ఆవు పాలు… వెన్న లేకుండా నెయ్యిని సృష్టించడం శాస్త్రవేత్తల వల్ల కూడా సాధ్యం కాదని అన్నారు. కేవలం వైసీపీ వాళ్ళకే సాధ్యం అవుతుంద‌న్నారు. భక్తులు పరమ పవిత్రంగా స్వీకరించే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ జరిగిందనేని నూటికి నూరు శాతం వాస్తవం అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలకు సరఫరా అయిన 60 లక్షల కిలోల ఆవు నెయ్యిలో ప్రతి చుక్కా కల్తీయేన‌ని పేర్కొన్నారు. రసాయనాలతో సృష్టించిన ద్రవాన్నే నెయ్యిగా చూపించి ఆ రసాయనాలు నిండిన ద్రావకంతో 20 కోట్ల లడ్డూలు చేసి ప్రసాదంగా విక్రయించారని ఆరోపించారు.