జగిత్యాల జిల్లా : 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్-2047’ (Telangana Rising-2047) విజన్ ఆధారంగా ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేస్తామని చెప్పారు. జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. 3,53,166 మంది అర్హులైన లబ్ధిదారులు వీటిని పొందనున్నారని ఆయన తెలిపారు.
రేషన్ కార్డులకు 87,837 మంది కొత్త సభ్యులు అదనంగా చేర్చబడ్డారని, అలాగే 48,868 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని మహమ్మద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. 11 విభాగాల కింద 2.18 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెలా రూ. 47 కోట్ల విలువైన పింఛన్లను అందిస్తోందని అజారుద్దీన్ చెప్పారు. ఆగస్టు 15 నుంచి కొత్త ‘చేయూత’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ లబ్ది పొందిన ప్రతి ఒక్కరికీ కార్డులను అందజేస్తామన్నారు. ఇది నిరంతరం కొనసాగుతుందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.





