హైదరాబాద్ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్తగా ఈవీ ఆటో లను తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్లాన్ కూడా తయారు చేసింది. త్వరలో ఈ ఈవీ ఆటోలు రోడ్డు ఎక్కనున్నాయి. తాజాగా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆటో యూనియన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పటికే ఉచిత బస్సు పథకం తో తాము రోడ్డున పడ్డామని, ఇప్పుడు ఈవీ ఆటోల పేరుతో తమ కడుపు కొడితే ఎలా అని ప్రశ్నించాయి. ఇదిలా ఉండగా ఎక్కువ మంది ప్రయాణికులను బస్సుల వైపు ఆకర్షించే లక్ష్యంతో, ఈ పైలట్ ప్రాజెక్టును మొదట నగర సర్వీసులతో ప్రారంభించి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని ఆర్టీసీ తెలిపింది. కాగా చివరి మైలు కనెక్టివిటీ కోసం ఈ-ఆటో రిక్షాలను ప్రవేశ పెట్టాలన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రతిపాదన, ఇదే ఉద్దేశంతో గతంలో ప్రవేశపెట్టి, ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉన్న మినీ-బస్సుల భవితవ్యంపై ప్రశ్నలను లేవనెత్తింది.
ఆటో డ్రైవర్ల యూనియన్లు, గిగ్, ప్లాట్ఫామ్ యూనియన్లు కూడా ఈ ప్రణాళికను వ్యతిరేకించాయి. జూలై 30న, నిర్దేశిత బస్ స్టాప్ల నుండి ప్రయాణికుల ఇంటి వద్దకే ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలను ప్రవేశపెట్టే ప్రణాళికలను కార్పొరేషన్ ప్రకటించింది. ఈ మొత్తం ప్రయాణానికి ఒకే టిక్కెట్ వర్తిస్తుంది. ఎక్కువ మంది ప్రయాణికులను బస్సుల వైపు ఆకర్షించే లక్ష్యంతో, ఈ పైలట్ ప్రాజెక్టును మొదట నగర సర్వీసులతో ప్రారంభించి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని ఆర్టీసీ తెలిపింది. ఆటోరిక్షా యూనియన్లు ఈ చర్యను తమ జీవనోపాధికి ముప్పుగా చూస్తున్నాయి. ఏఐటియుసి ఆటోరిక్షా డ్రైవర్ల యూనియన్ నాయకుడు ఉమర్ ఖాన్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పటికే ఆటోరిక్షాలకు వ్యాపారం దాదాపుగా లేకుండా పోయింది. ఇప్పుడు లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం ఈ-ఆటోలను తీసుకు రావాలన్న ఆర్టీసీ ప్రణాళిక మమ్మల్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది అని అన్నారు.





