ముంబై : విమల్ యాలాకుల ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ , టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఎఫ్డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల పరోక్ష లేదా ప్రత్యామ్నాయ ప్రచారంగా పరిగణించ బడుతుందని ఎఫ్డిఎ పేర్కొంది. ప్రకటనలో విమల్ యాలాకులు అనే పదాన్ని ఉపయోగించడం విమల్ పాన్ మసాలా బ్రాండ్తో సంబంధాన్ని ఏర్పరుస్తున్నట్లుగా కనిపిస్తోందని, ఇది నిషేధిత ఉత్పత్తిని పరోక్షంగా ప్రోత్సహిస్తూ వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) తెలిపింది.
ఈ ప్రకటనలో విమల్ పాన్ మసాలాతో ముడిపడి ఉన్న అదే బ్రాండ్ గుర్తింపును ఉపయోగించడం వల్ల ఈ విషయం మరింత తీవ్రమైనదని, ఆగస్టు 11న జారీ చేసిన నోటీసులో ఎఫ్డిఎ గ్రేటర్ ముంబై విభాగం పేర్కొంది. ఈ ముగ్గురు నటులను బ్రాండ్ ప్రచారకర్తలుగా అభివర్ణిస్తూ, 15 రోజుల్లోగా వారి స్పందన తెలియ చేయాలని కోరింది. ఈ నోటీసును తుది హెచ్చరికగా పేర్కొంటూ, ఈ ప్రకటన ప్రాథమికంగా ఆహారానికి సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనగా కనిపిస్తోందని, ఇది ఆహార భద్రత , ప్రమాణాల చట్టం, 2006 మరియు దాని కింద రూపొందించిన నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిపింది. ఇతర చట్టాలు , మార్గదర్శకాల ప్రకారం పరోక్ష లేదా ప్రత్యామ్నాయ ప్రకటనలకు సంబంధించిన ఉల్లంఘనలు కూడా జరగవచ్చని ఇది సూచించింది.
విమల్ పాన్ మసాలా/యాలకుల ప్రకటనలో పాల్గొనడాన్ని, దానికి మద్దతు ఇవ్వడాన్ని తక్షణమే నిలిపి వేయాలని, అలాగే తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్, వెబ్సైట్లు , తమ నియంత్రణలో ఉన్న ఇతర డిజిటల్ ప్లాట్ఫారమ్ల నుండి ఆ ప్రచార కంటెంట్ను తొలగించాలని ఎఫ్డిఎ నటీనటులను ఆదేశించింది. ఆ ప్రకటన ప్రసారం, ప్రచురణ, వ్యాప్తి లేదా ప్రచారంలో ఏ రూపంలోనూ ఇకపై ఎలాంటి సహకారం లేదా సహాయం అందించవద్దని కూడా వారిని ఆదేశించింది. ఈ ప్రచారంలో పాల్గొనడానికి ముందు, నటీనటులు తాము గానీ లేదా తమ ఏజెన్సీలు గానీ చేపట్టిన తగిన శ్రద్ధ (డ్యూ డిలిజెన్స్) వివరాలను అందించాలని కూడా ఆ నోటీసు కోరింది.







