స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తో కలిసి ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నియోజకవర్గాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు . ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఇదే సమయంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు వంగలపూడి అనిత.
ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం, బలగమని పేర్కొన్నారు. గతంలో కొలువు తీరిన జగన్ రెడ్డి వైసీపీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేయడంతో వాటిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేయింబవళ్లు కష్ట పడుతున్నాడని చెప్పారు వంగలపూడి అనిత. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి గణనీయమైన కార్యకర్తలు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. కార్యకర్తలకు నారా లోకేష్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని , దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు పార్టీ అభివృద్ది కోసం అంకితం కావాలని పిలుపునిచ్చారు.





