ప్రకటించిన అనుముల రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాండూరును అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామని ప్రకటించారు. తాండూరు పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో పాటు కాగ్నా నుంచి మంచినీటిని అందించే కార్యక్రమాలను పూర్తి చేస్తామని చెప్పారు. సంవత్సరం తిరిగే లోపు అప్పా జంక్షన్ నుంచి మన్నె గూడ వరకు, అక్కడి నుంచి తాండూరు వరకు రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ మణిహారంగా త్రిబుల్ ఆర్, అలాగే రేడియల్ రోడ్లను పూర్తి చేస్తామని, రాబోయే రోజుల్లో వికారాబాద్ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారబోతోందన్నారు రేవంత్ రెడ్డి.
అనేక సమస్యలను అధిగమిస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ప్రజలంతా సహకరించాలని కోరారు. తెలంగాణలో ప్రధానంగా రైతాంగం, నిరుద్యోగ యువత, మహిళలు ప్రాధాన్యంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాలోని 6,650 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి కింద రూ. 567.69 కోట్ల చెక్కులను మహిళా ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.






