నన్ను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది
ఖమ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్ ప్రచారంలో భాగంగా ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. మధిర అంటే తనకు పంచ ప్రాణం అన్నారు. తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఆపై ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం కల్పించిందన్నారు. బతికి ఉన్నంత వరకు రుణపడి ఉంటానని ప్రకటించారు. మధిరతో విడదీయలేని బంధం నెలకొందన్నారు. మధిర కీర్తి ప్రతిష్టలను పెంచుతానని, మరో 50 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అద్భుతమైన పట్టణాన్ని నిర్మించే బాధ్యతను నేను తీసుకుంటున్నానని ప్రకటించారు.
హైదరాబాద్, అమెరికా తరహాలో మధిరలో అత్యున్నత వైద్య రక్షణ సదుపాయాలు కల్పిస్తాం అని తెలిపారు మల్లు భట్టి విక్రమార్క.రెప్పపాటు కూడా కరెంటు పోకుండా అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థను,
స్వచ్ఛమైన నగరం కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వేగవంతం చేస్తున్నాం అన్నారు. పట్టణ విస్తరణకు కీలకమైన ఔటర్ రింగ్ రోడ్డు పనుల కోసం ఇప్పటికే నిధులు జమ చేశామని వెల్లడించారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వర్షపు నీరు, మురుగు నీటి తరలింపునకు ప్రత్యేక మార్గాలు నిర్మిస్తూనే , వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కోసం రిటైనింగ్ వాల్ మరియు బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నాం అన్నారు.





