కీలక వివరాలు వెల్లడించిన డీఎస్పీ చలసాని, సీఐ
పెనమలూరు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోరంకి లోని శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న మొల్లి పవన్ కుమార్ సూసైడ్ కేసులో కీలక మలుపు తిరిగింది. సహచర విద్యార్థులు తనపై దాడి చేయడం, అందుకు సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్ గా మారడంతో తట్టుకోలేక పోయాడు పవన్ కుమార్. చివరకు సూసైడ్ చేసుకున్నాడు. అంతే కాదు తనను దారుణంగా కొట్టిన వారి పేర్లను మృతుడు చేతిపై రాసుకున్నాడని, ఈ పేర్లను బయటకు రాకుండా శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం సాక్ష్యాలను ధ్వంసం చేసిందని డీఎస్పీ చలసాని, సీఐ వెంకటరమణలు వెల్లడించారు. ఆదివారం మీడియాతో విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన కేసు వివరాలను వెల్లడించారు.
మృతుడి స్వస్థలం బుచ్చయ్యపేట మండలం లింగభూపాలపుర అగ్రహారం. తన వయసు 17 ఏళ్లు. శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటున్న సమయంలో హేమంత్ అనే తోటి స్టూడెంట్ తో గొడవ జరిగింది. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. హేమంత్ తో మాట్లాడ వద్దంటూ పవన్ కుమార్ తోటి విద్యార్తులకు సూచించాడని, దీనిని గమనించిన హేమంత్ మిగతా స్టూడెంట్స్ తో కలిసి గత జనవరి 5వ తేదీన రాత్రి 11 గంటలకు పవన్ కుమార్ ను గదికి పిలిపించారు. దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఆపై ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. అది వైరల్ అయ్యింది. దీనిని తట్టుకోలేక పోయాడు పవన్ కుమార్. ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనను కొట్టిన వారి పేర్లను తన చేతిపై రాసుకున్నాడు. దీనిని ప్రిన్సిపల్ సూచనల మేరకు ఫ్లోర్ ఇన్ ఛార్జి రవీంద్ర, మెస్ నిర్వాహకులు హేమంత్, రాజేష్ , జూనియర్ లెక్చరర్లు ఆనంద్, కృష్ణ ఆ పేర్లను తుడిచి వేశారని పోలీసులు వెల్లడించారు. తమకు తెలియకుండానే ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ తో పాటు పేర్లను తుడిచి వేసిన వారితో పాటు దాడికి పాల్పడిన వారిని మొత్తం 12 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు డీఎస్పీ, సీఐలు.





