సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి పవన్ స్పందన
అమరావతి : మాకు చదువు కోవాలని ఉంది. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి సార్ అంటూ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు వేడుకున్నారు. ఈ సందర్బంగా వారు ఎన్నిసార్లు ప్రజా ప్రతినిధులకు తెలియ చేసినా స్పందించక పోవడంతో సామాజిక మాధ్యమాల ద్వారా తమ గోడును వీడియో రూపంలో వెళ్ల బోసుకున్నారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. అది కాస్తా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలకు చేరుకుంది. వారి ఆవేదన తనను కదిలించేలా చేసింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించి పోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు.
తక్షణమే నెల్లూరు జిల్లా కలెక్టర్ తో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి. ఈ సందర్బంగా తమ ఊరికి రోడ్డు మంజూరు చేయించినందుకు ఉపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు.






