ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి
తిరుపతి జిల్లా : కేంద్ర సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మన్రేగా పథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించడం దారుణం అన్నారు. ఆనాడు గాంధీని గాడ్సే చంపాడు. ఇప్పుడు గాంధీ పేరు తొలగించి మోడీ గాంధీని మళ్లీ చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీసుకొచ్చిన VBGRAM G చట్టం మన్రేగాకు ప్రత్యామ్నాయం కానేకాదని అన్నారు. ఇది పేదల పొట్ట కొట్టే చట్టం తప్ప మరోటి కాదన్నారు. ఉపాధికి ఊపిరి తీసిన చట్టం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉపాధి హామీ పథకం అంటే ఒక పండగ అని అన్నారు. ఇప్పుడు ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ భ్రష్టు పట్టించిందని ఆరోపించారు షర్మిలా రెడ్డి.
మన్రేగా కింద పనులు గ్రామసభలవి అని పేర్కొన్నారు. గ్రామాలకు ఏం కావాలో గ్రామసభలే నిర్ణయిస్తాయని చెప్పారు. ఇప్పుడు ఉపాధి హామీ పనులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 125 రోజుల పని కల్పన అనేది పచ్చి మోసం అన్నారు. 52 రోజులు కూడా పని ఇవ్వని వాళ్లు 125 రోజులు ఇస్తాం అంటే నమ్మడానికి మనం అజ్ఞానులం కాదని పేర్కొన్నారు షర్మిలా రెడ్డి. బీజేపీ తెచ్చిన గ్రామ్ జి చట్టం రాష్ట్రానికి పెనుభారంగా మారుతుందన్నారు. 40 శాతం నిధులు రాష్ట్రం ఇవ్వడం అంటే 5 వేల కోట్ల భారం పడుతుందని ఆవేదన చెందారు. అప్పుల్లో ఉన్న మన రాష్ట్రం గ్రామ్ జి చట్టానికి 5 వేల కోట్లు ఖర్చు చేస్తుందా? అసలు చేయగలదా? ఈ గ్రామ్ జి చట్టానికి చంద్రబాబు మద్దతు ఇవ్వడానికి సిగ్గుండాలని ఫైర్ అయ్యారు. మళ్లీ కేంద్రం దగ్గరకు వెళ్లి నిధులు ఎలా అడుగుతున్నారంటూ నిలదీశారు.





