మెట్లోత్సవం ప్రారంభోత్సవంలో టీటీడీ జేఈవో
తిరుమల : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్ ఏ.శరత్ అన్నారు. తిరుమలలో మూడు రోజుల పాటు నిర్వహించిన శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ కార్యక్రమం ఆస్థాన మండపంలో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. తిరుమలలో నిర్వహించిన మెట్లోత్సవం కార్యక్రమం ద్వారా ధర్మ ప్రచారం, సనాతన ధర్మ సంరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ గ్రామాల నుండి విచ్చేసిన వాలంటీర్లు, సేవకులు స్వామివారి ప్రతినిధులుగా భక్తిని ప్రజల్లో వ్యాప్తి చేయాలన్నారు.
భక్తిమార్గమే వ్యక్తిగత శాంతికి, కుటుంబ శాంతికి, సమాజ శాంతికి పునాది అని, శ్రీవేంకటేశ్వర స్వామి నామస్మరణే దీనికి మూలమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు మాట్లాడుతూ ఒక్కసారి మెట్లోత్సవంలో పాల్గొంటే 108 సార్లు స్వామివారిని దర్శించుకున్న పుణ్యఫలం దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్తలు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన భజన మండలి సభ్యులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.






