నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
నెల్లూరు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా కోట్లాది మంది కూలీలు, పేదలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందారు. యూపీఏ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని కావాలని మార్చారని, దానిని నిర్వీర్యం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. కొత్త చట్టం ఆమోదించడం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందన్నారు. దీని కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున కూలీలు, పేదలు, సామాన్యులకు తీరని నష్టం జరుగుతుందన్నారు షర్మిలా రెడ్డి.
జాతీయ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో భాగంగా షర్మిలా రెడ్డి చేపట్టిన యాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్బంగా ఆమెకు కావలి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆముదాల దిన్నె గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి భారీగా చేరుకున్నారు. గ్రామస్థులు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, VB G – RAM G పథకాన్ని రద్దు చేయాలని, కాంగ్రెస్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఆనాడు YSR హయాంలో కాంగ్రెస్ పాలనలో ఉపాధి హామీ పథకం అంటే గ్రామాల్లో పండుగను తలపించేదని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చాక పథకాన్ని ఉద్దేశ్య పూర్వకంగా నీరుగార్చారని ఆరోపించారు షర్మిలా రెడ్డి.






