హైదరాబాద్ లో దూకుడు పెంచిన హైడ్రా
హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఆద్వర్యంలో ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రతీ సోమవారం ప్రజా వాణి చేపట్టింది. ఇదే క్రమంలో ప్రతీ శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తాజాగా మొండికుంటతో పాటు అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై జనవరి 31న హైడ్రా విచారణ కూడా చేపట్టింది. రెవెన్యూ అధికారులతో పాటు.. కబ్జాలకు పాల్పడిన వారు కూడా ఈ సమవేశంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఆక్రమణలు జరిగినట్టు రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఎన్ ఆర్ ఎస్ సీ శాటిలైట్ చిత్రాలను పరిశీలించి కూడా ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించారు.
ఇదే విషయాన్ని కబ్జాదారులకు తెలియ జేశారు. వారికి కొంత సమయాన్ని ఇచ్చారు. చివరకు హైడ్రా ఆక్రమణలను తొలగించే పనిని చేపట్టింది. వందల సంఖ్యలో ఉన్న తాత్కాలిక షెడ్డులను భారీ బందోబస్తు మధ్య హైడ్రా తొలగించింది. ఈ ఆక్రమణలు తొలగించిన సందర్భంలో అక్కడ స్థానికులు పెద్ద మొత్తంలో వచ్చి హైడ్రా చర్యలను అభినందించారు. మొండికుంట చెరువును కాపాడినందుకు అక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు తొలగించిన చోట పార్కులను అభివృద్ధి చేయాలని స్థానికులు ఈ సందర్భంగా హైడ్రా అధికారులను కోరారు. అలాగే చెరువును కూడా అభివృద్ధి చేసి సుందరీకరించాలని అభ్యర్థించారు.






