అబద్దాలు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం
అమరావతి : శాసన మండలిలో వైసీపీ సభ్యులు సభను సజావుగా సాగనీయకుండా అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. శుక్రవారం పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు లోకేష్. నిజాలు చేదుగా ఉంటాయన్నారు. వైసీపీ సభ్యులు అబద్దాలు చెప్పి బయటకు వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యపై దృష్టి పెట్టడం లేదంటున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 70 వేల మంది విద్యార్థులు పెరిగారు. అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి. వైసీపీ ఐదేళ్ల కాలంలో కనీసం పుస్తకాలు బ్యాగ్స్ ఇవ్వలేదని ఆరోపించారు నారా లోకేష్. మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. మేం ఇంటర్ లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్దరించాం అని ప్రకటించారు. పుస్తకాలు ఇస్తున్నాం. 10, ఇంటర్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నాం అన్నారు.
వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్ గా మారిందన్నారు నారా లోకేస్. ఈ తలుపు నుంచి వెళ్తారు. హాయిగా టీ తాగి ఆ తలుపు నుంచి వస్తారు. చిత్తశుద్ధి ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే సమాధానం ఇస్తున్నాం అన్నారు. సమస్యలు లేవని మేం చెప్పడం లేదన్నారు. మేం వినేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గతంలో మాదిరిగా నోరు మూసివేయడానికి కాదు మేం ఇక్కడ ఉన్నది అని మండిపడ్డారు. మేం చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు. పరదాలు కట్టుకుని మేం తిరగడం లేదు. అసెంబ్లీకి సీఎం వస్తుంటే ప్రజలు నవ్వుతూ చేతులు ఊపుతున్నారు. గత సీఎం 3వేల మంది పోలీసులను పెట్టేవారు రోడ్లపైన. యుద్ధవాతావరణం ఉండేదని అన్నారు.





