నాలుగు కార్మిక కోడ్ లపై మండిపాటు
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేపట్టారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేశారు. చాలా చోట్ల కార్మికులతో పాటు సంఘీభావంగా రైతులు కూడా రోడ్డెక్కారు. కార్మికులకు మద్దతు ప్రకటించారు. మోదీ సర్కార్ మోసం చేస్తోందని, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కేవలం కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూర్చేలా తమ పొట్ట కొట్టేలా చట్టాలను తీసుకు వస్తోందని మండిపడ్డారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు కార్మిక కోడ్లు, VB-GRAMG చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కార్మికులు ముక్త కంఠంతో నినదించారు. లేక పోతే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామంటూ ప్రధాని మోదీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ప్రయోజనాలకు హానికరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పేరుతో దగా చేశారని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చేశారని, పేదలు, కూలీలు, కార్మికులకు నష్టం చేకూర్చేలా చట్టాన్ని మార్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ఇలాంటి ప్రజా వ్యతిరేక విధనాలను అవలంభించ వద్దంటూ కోరారు.






