నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయాలు చేయడం తగదన్నారు. హెరిటేజ్ సంస్థ ప్రభుత్వాలను అడ్డం పెట్టుకుని వ్యాపార లావాదేవీలు జరపకూడదని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వాల పేరుతో డబ్బులు దోచుకునే సంస్కృతి హెరిటేజ్ది కాదని స్పష్టం చేశారు శాసన సభలో. గతంలో ప్రభుత్వ ధనాన్ని భారతి సిమెంట్ పేరుతో దోచుకున్న చరిత్ర వైసీపీకి మాత్రమే ఉందని తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతల చర్యలు ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు.
గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్ను ఎలా అరికట్టామో అలాగే ఇప్పుడు కూడా ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలనే ప్రయత్నాలను సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చీని తోటలు కట్ చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం వంటి పాత పద్ధతులే ఇప్పుడు సంస్థలపై బదనాం చేయడంగా మారాయని మండి పడ్డారు. సభను ఇబ్బందికి గురి చేయడం సరికాదని అన్నారు. శాసన మండలిలో ప్రతిరోజూ ఒకే అంశాన్ని తీసుకొచ్చి వాయిదా తీర్మానాలతో సభను ఇబ్బందికి గురి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి హెచ్చరించారు. ఆధారాలుంటే టేబుల్పై పెట్టండి, లేదంటే అసత్య ప్రచారం మానేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.





