జూబ్లీహిల్స్ లో శ్రీవారి భక్తుల సందోహం వైభవోపేతం
తిరుపతి : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా సాగింది.
చిన్నశేషుడిని వాసుకి( నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేష వాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినీ యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. వాహనసేవలో అర్చకులు, ఏఈవో రమేష్, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, పలువురు అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి కళ్యాణోత్సవానికి సిద్దమైంది. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇవాళ జేఈవో వీరబ్రహ్మం ఆకస్మికంగా తనిఖీ చేశారు.






