ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఎలా
నంద్యాల జిల్లా : మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. యుపీఏ హయాంలో తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ద్వారా కోట్లాది మందికి ఉపాధి దక్కిందన్నారు. దీనిని తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం కావాలని నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఇదే క్రమంలో కోట్లాది మంది కడుపు కొట్టేలా ఉపాధి హామీ పథకం చట్టంలో మార్పు చేసిందని ఆరోపించారు షర్మిలా రెడ్డి. ఇదిలా ఉండగా పీసీసీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ పథక పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది.
ఇందులో భాగంగా ఇవాళ పరిరక్షణ యాత్ర నంద్యాల జిల్లాకు చేరుకుంది. జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజక వర్గ ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. శిరివెళ్ల మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు ఏపీపీసీసీ చీఫ్. మన్రేగా పథకం లబ్ధిని, ప్రధాని మోడీ తెచ్చిన కొత్త అక్రమ చట్టం VB G- RAM G ద్వారా జరిగే నష్టాన్ని స్థానిక ప్రజలకు వివరించారు. ఉపాధి హామీ పథకం పునరుద్ధరణకు వారి మద్దతు పొందడం జరిగిందని చెప్పారు. మోదీ వచ్చాక దేశాన్ని అప్పుల కుప్పగా మార్చాడని ఆరోపించారు షర్మిలా రెడ్డి. కేవలం కార్పొరేట్ కంపెనీలకు, వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా చర్యలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.





