నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత
హైదరాబాద్ : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె శుక్రవారం శాసన సభలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. అసెంబ్లీ, శాసన మండలి సజావుగా జరగకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. జగన్ రెడ్డి ఇంకా అధికారంలోనే ఉన్నానని భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. చిల్లర రాజకీయాలకు ఇది వేదిక కాదని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
ప్రజా సమస్యలపై చర్చించకుండా, తమ తప్పులు బయట పడకుండా వైసీపీ సభ్యులు ఎంతటి నీచానికైనా దిగజారి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్. సవిత. సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం బయటకు రావడంతో జగన్, వైసీపీ సభ్యులు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఎప్పుడో వారిని పట్టించు కోవడం మానేశారని అన్నారు. 33 ఏళ్ల నుంచి హెరిటేజ్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని వ్యాపార ప్రస్థానాన్ని ముందుకు సాగిస్తోందన్నారు. హెరిటేజ్ కు, టీటీడీకి ఎటువంటి సంబంధమూ లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు.





