ఇద్దరు ఆటగాళ్లది విడదీయలేని అనుబంధం
కోలకోతా : క్రికెట్ కు జీవితానికి దగ్గరి సంబంధం ఉంది. ఇలాంటి అపురూపమైన క్షణాలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం కోల్ కతా వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ విండీస్ మ్యాచ్. ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలుపొందడం కీలకం. ఎవరు ఓడినా ఇంటికి వెళ్లక తప్పదు. ఈ తరుణంలో డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న భారత జట్టు అనూహ్యంగా భారీ టార్గెట్ ను ఛేదించింది. నేరుగా సెమీ ఫైనల్ కు చేరుకుంది. టీం ఇండియాలో కీలకమైన పాత్ర పోషించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.
చివరి దాకా ఉన్నాడు . జట్టును గెలిపించాడు. చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 50 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 12 ఫోర్లు 4 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. నిన్నటి దాకా తనను ట్రోల్ చేసిన వాళ్లు ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. యావత్ దేశం శాంసన్ నామ స్మరణ చేస్తోంది.
మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు 19.2 బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి కానిచ్చేసింది. 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సందర్బంగా ప్రత్యర్థి జట్టుకు చెందిన సిమ్రాన్ హిట్మెయర్ తన సహచర ఆటగాడు , ప్రత్యర్థి జట్టుకు చెందిన శాంసన్ ను ఆలింగనం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ కలిసి రాజస్తాన్ రాయల్స్ జట్టు తరపున ఆడారు. సంజూ కెప్టెన్సీలో తాను ఎన్నో నేర్చుకున్నానని చెప్పాడు సిమ్రోన్. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.





