5 వికెట్ల తేడాతో విక్టరీ..సెమీస్ కు ఎంట్రీ
కోల్ కతా : ఎవరూ ఊహించని రీతిలో టీమిండియా అద్భుతం చేసింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన కీలక మ్యాచ్ లో ప్రత్యర్థి విండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే అవలీలగా ఛేందిచింది. అరుదైన రికార్డును నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచింది. అనంతరం 196 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లు నిరాశ పరిచారు. అయినా ఎక్కడా తొట్రుపాటుకు గురి కాలేదు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను ఏ ఒక్క బౌలర్ ను విడిచి పెట్టలేదు.
ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. దీంతో స్టేడియం యావత్తు సంజూ సంజూ అంటూ హోరెత్తి పోయింది. తను కేవలం 50 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఇందులో 12 ఫోర్లు 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 97 పరుగులు చసిన సంజూ శాంసన్ చివరి వరకు ఉన్నాడు. తన ఒంటి చేత్తో భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు పొట్టి ఫార్మాట్ వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ పేరుతో నమోదైన రికార్డును చెరిపి వేశాడు. ఇంకా 4 బంతులు మిగిలి ఉండగానే పని పూర్తి కానిచ్చేశాడు సంజూ శాంసన్. దీంతో భారత జట్టు 5 వికెట్ల తేడాతో విండీస్ ను ఓడించింది. సెమీ ఫైనల్ కు చేరుకుంది.





