సత్తా చాటిన సంజూ శాంన్, బుమ్రా, పటేల్
ముంబై : భారత జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ముంబై వేదికగా జరిగిన కీలకమైన పోరులో ఇంగ్లండ్ పై 7 పరుగుల తేడాతో ఓడించి ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. అడుగు దూరంలో మరో అరుదైన రికార్డును నమోదు చేసేందుకు రెడీ అయ్యింది. ఈనెల 8వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్ తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది టీం ఇండియా. ఆటగాళ్లు కలిసికట్టుగా ఆడారు. సత్తా చాటారు. చివరి ఓవర్ దాకా నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ ను ఎల్లప్పటికీ అభిమానులకు గుర్తుండి పోతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది.
కోల్ కతా వేదికగా విండీస్ తో జరిగిన కీలక పోరులో సత్తా చాటిన సంజూ శాంసన్ మరోసారి సెమీస్ లో సత్తా చాటాడు. 89 పరుగులతో దుమ్ము రేపాడు. ఇందులో 8 ఫోర్లు 7 సిక్సలు ఉన్నాయి. ఇరు జట్లు కలిసి ఏకంగా 499 రన్స్ చేయడం రికార్డ్. శాంసన్ తో కలిసి ఇసాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే బ్యాటింగ్ లో తళుక్కున మెరిస్తే బుమ్రా, అక్షర్ పటేల్ బౌలింగ్ పరంగా సత్తా చాటారు. మరో వైపు ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్ దాకా పోరాడింది. ఒక రకంగా భారత జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. ఇక T20 ప్రపంచ కప్ లో చరిత్ర సృష్టించిన భారత్కు ఒక అడుగు దూరంలో ఉంది.





